ఖమ్మంపల్లిలో రైతులకు వ్యవసాయ శిక్షణ
అర్జున్ సమాచారం | ఆగస్టు 22 | ముత్తారం రిపోర్టర్
ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి రైతువేదికలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) రామగిరికి చెందిన శాస్త్రవేత్త డా. వినోద్ రైతులకు పలు వ్యవసాయ అంశాలపై అవగాహన కల్పించారు.
నానో ఫెర్టిలైజర్ల ఆవశ్యకత, వాటి వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. అదేవిధంగా నూనెగింజల పంటల సాగుతో రైతులకు కలిగే లాభాలను తెలియజేస్తూ, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు.
వరి, పత్తి పంటల్లో సస్యరక్షణ పద్ధతులు, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవసాయంలో పాటించాల్సిన సాగు మెలకువలను శాస్త్రవేత్త వివరించారు. శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వరి, ఉపసర్పంచ్ సతీష్, మండల వ్యవసాయ అధికారి జె. అనూష, వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్. శ్రీలేఖతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.